అరగంట టైమ్ ఇస్తున్నా.. తెలుసుకుని చెప్పండి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం

  • బిక్నూర్ లో రేషన్ షాప్ ను సందర్శించిన నిర్మల
  • ఫ్లెక్సీలో ప్రధాని ఫొటో లేకపోవడంతో కలెక్టర్ పై ఆగ్రహం
  • ఉచిత బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అని ప్రశ్న
తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. నేటి పర్యటన సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బిక్నూర్ లో రేషన్ షాపును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ పై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఉచిత రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంత? రాష్టం వాటా ఎంత? అని కలెక్టర్ ను నిర్మల ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. తెలియదని అన్నారు. దీంతో, ఆయనపై కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారి అయిన మీకు తెలియక పోవడం ఏమిటని కన్నెర్ర చేశారు. అరగంట సమయం ఇస్తున్నానని... తెలుసుకుని చెప్పాలని ఆదేశించారు. 

అంతే కాదు, రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై కూడా నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని ఇస్తోందని... అలాంటప్పుడు ప్రధాని ఫొటోను ఎందుకు ఉంచలేదని మండిపడ్డారు. రేషన్ షాపుల వద్ద మోదీ ఫొటో పెట్టాలని... లేకపోతే తానే వచ్చి పెడతానని హెచ్చరించారు.

Nirmala Sitharaman
Narendra Modi
BJP
Kamareddy District
District Collector

More Telugu News